Sunday 6 May 2012

దైవానికి దగ్గర చేసే సత్సంగం


నేడు సమాజంలో నెలకొని ఉన్న అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం సత్సంగమే. సత్సంగం వలన మనిషికి తన గమ్యమేమిటో, ఏది సత్యమో, ఏది నిత్యమో, దేనిని ఎలా పొందాలో, దేనిని త్యజించాలో అనే విషయాలలో విచక్షణ కలుగుతుంది. సత్సాంగత్యం వలన మనసు పవిత్రమవుతుంది. విశాలదృక్పథం ఏర్పడుతుంది. అహంకారం తొలగి విశ్వవ్యాపిత భావన ఏర్పడుతుంది.

సత్సంగం అంటే సజ్జనుల సాంగత్యం లేదా సత్‌గ్రంథం, సత్‌కర్మ, సత్‌చింతన, సత్‌స్వరూపులతో సాంగత్యం లేదా సంపర్కం ఏర్పరచుకోవడం. సత్సాంగత్యం వలన నేను, నాది, నాకు అనే ఆలోచనలు తగ్గి మానసికంగా అత్యున్నత స్థాయికి ఎదుగుతాడు. సత్సంగాల వలన సమాజానికి మేలు జరుగుతుంది. సత్సంగంలో పాల్గొనే వారు మంచి ఆలోచనా విధానాన్ని కలిగి నిరంతరం భగవత్ సేవలో ఉంటూ, భగవత్ కార్యాలను చేస్తూ ఉంటారు. అందుకే ‘స్వామి వివేకానంద’ ‘‘ఒక మనిషి నిరంతరం చెడు మాటలు వింటూ, చెడు ఆలోచనలు చేస్తూ ఉంటే అతని మనస్సంతా చెడు ముద్రలు పడిపోతాయి. అవి అతడి ఆలోచనలను, పనులను ప్రభావితం చేస్తాయి. వాటి చేతులలో కీలుబొమ్మగా మారిపోతాడు. అవి అతడి చేత బలవంతంగా చెడు చేయిస్తాయి. అదేవిధంగా ఒక మనిషి మంచి ఆలోచనలు, మంచి పనులు చేస్తూ ఉంటే వాటి ముద్రలు అతడి చేత బలవంతంగా మంచినే చేయిస్తాయి. అలా జరిగినప్పుడు ఆ వ్యక్తి యొక్క సచ్ఛీలం సుస్థిరమైనదని చెప్పబడుతుంది. అందుకే మంచి శీల నిర్మాణం జరగాలంటే సత్సంగం తప్ప వేరే మార్గం లేదు’’ అన్నారు.

భౌతిక ప్రపంచంలో, ప్రాపంచిక భోగాల్లో, విషయ వాసనలు తగులుకొంటున్న కొలదీ మనిషి పతనమైపోతాడు. వీటన్నింటికీ విరుగుడు సత్సంగమే.సంగం సత్ చేయడం వలన సత్పురుషులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. సద్గ్రంథాల నుండి ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకోగలుగుతారు. స్వార ్థప్రయోజనాల నుండి దూరమై సమాజ సంక్షేమం కోసం పాటుపడతారు. రాగద్వేషాలు అంటవు. ద్వంద్వాలకు అతీతంగా మనస్సు నిశ్చలమై యోగంలో జీవిస్తూ ఉంటారు. అలాంటి స్థితే పరమాత్మ దర్శనానికి అనువైనది. అందుకే సత్సంగమే పరమాత్మను చేరడానికి సులభమైన మార్గం.

సత్సంగత్వంలో ఒక క్షణం గడపడం వలన జన్మజన్మల సంస్కారం కలుగుతుందట. అందుకు ఒక కథ ఉంది. ఒకసారి నారద మహర్షికి ‘సత్సంగం అంటే ఏమిటి? దాని వల్ల కలిగే ఫలితాలేమిటి?’ అనే సందేహం కలిగి దానిని నివృత్తి చేసుకోవడం కోసం శ్రీమహావిష్ణువు దగ్గరకు వెళ్లి ఆయనను అడిగాడు. అప్పుడు శ్రీహరి, ‘ఓస్! ఇంత మాత్రానికే నా దగ్గరకు రావాలా? అదిగో అక్కడ ఒక పురుగు పాకుతోంది. దాన్ని అడుగు’ అన్నాడు. అలాగే వెళ్లి ఆ పురుగుని ‘సత్సంగమంటే ఏమిటి?’ అని అడిగాడు నారదుడు. దానికి ఆ పురుగు ‘సత్సంగమంటే...’ అంటూ ప్రాణం వదిలేసింది. నారదుడు ఇలా జరిగిందేమిటా అనుకుంటూ మళ్లీ విష్ణుమూర్తి దగ్గరకొచ్చాడు.

ఈసారి ‘అదిగో అక్కడ చెంగనాలు పెడుతున్న కోడెదూడను అడుగు’ అనగానే నారదుడు కోడెదూడను అదే ప్రశ్న అడగడంతోటే అది కూడా ప్రాణం వదిలింది. నారదుడు మళ్లీ విష్ణువు దగ్గరకు వెళితే, ‘ఒక లేడి పిల్లను కంటోంది. పుట్టే ఆ పిల్లను అడుగు చెబుతుంది’ అనడంతో నారదుడు అప్పుడే పుట్టిన లేడిపిల్లను అడిగాడు. నారదుడికి అదే అనుభవం ఎదురయింది. నారదుడు బాధపడుతూ గట్టిపట్టుదలతో మళ్లీ విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లాడు. విష్ణువు చిద్విలాసంగా ‘నారదా! కాశీరాజుకు ఒక చక్కటి కుమారుడు పుడుతున్నాడు. అతడిని అడిగి నీ సందేహం తీర్చుకో’అన్నాడు. అప్పుడు నారదుడు ‘‘స్వామీ! మీరు నా సందేహం తీర్చుకొనేందుకు వెళ్లమంటున్నారా? లేక బిడ్డకు ఏదైనా అపాయం జరిగితే నాకు దేహశుద్ధి చేస్తారనే ఉద్దేశ్యంతో అక్కడకు పొమ్మంటున్నారా?’’ అని అడిగాడు. అందుకు శ్రీమహావిష్ణువు ‘అటువంటిదేమీ జరగదు.

ఈసారి నీ సందేహం తప్పక తీరుతుంది. నీ రాకతో వారెంతో సంతోషిస్తారు’అని చెప్పడంతో నారదుడు కాశీరాజు ఇంటికి వెళ్లాడు. కొడుకు పుట్లిన ఆనందంలో అక్కడ వారందరూ ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో నారదుడు అక్కడికి రావడంతో వారంతా సంతోషంతో స్వాగతం పలికి అతిథిమర్యాదలు చేశారు. నారదుడు ఆ బిడ్డను ఆశీర్వదించి ‘‘నా సందేహం తీర్చవలసింది అంటూ వచ్చిన విషయం చెప్పాడు. అప్పుడు ఆ బిడ్డ, ‘స్వామీ! మీరు నన్ను ఈ ప్రశ్న ముందు పురుగుగా ఉన్నప్పుడు, తర్వాత కోడెదూడగా ఉన్నప్పుడు వేశారు. ఆ తర్వాత జింకపిల్లగా ఉన్నప్పుడు వేశారు. ఆ మాట వినటం చేత ఆ జన్మలన్నీ రహితమయ్యి ఈ జన్మ సంప్రాప్తించింది. అనగా కేవలం ‘సత్సంగం’ అనే ఒక్కమాట వినడంతోటే నాకు ఒకదాని తర్వాత మరొకటి ఇన్ని పవిత్రజన్మలు లభించాయి కదా! మరి ఇక నిజంగా సత్సాంగత్యం చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో కదా! నేను నీకు సర్వదా కృతజ్ఞుడిని’’ అన్నాడు ఆ బాలుడు. ఇదీ సత్సంగం మహిమ.
సత్సంగత్వే నిస్సంగత్వమ్ నిస్సంగత్వే నిర్మోహత్వమ్
నిర్మోహత్వే నిశ్చలతత్వమ్ నిశ్చలతత్వే జీవన్ముక్తిః

అన్నారు జగద్గురు ఆదిశంకరులవారు. సంగము అంటే అన్నిటి మీద ప్రగాఢమైన అనుబంధం ఏర్పడటం. నిస్సంగం అంటే దేనియందు ఏ విధమైన అనురక్త్తి లేకపోవడం. సంగం సంకెళ్లవలె మానవుని బంధిస్తుంది. విషయ వాసనలు తగులుకుంటున్నకొద్దీ మానవుడు పతనమైపోతాడు. వీటన్నింటికీ విరుగుడు సత్సంగం. సత్సంగమే పరమాత్మను చేరడానికి సులభమైన మార్గం.

- చంద్రారెడ్డి
యోగా గురువు
          
07/05/2012  సాక్షి దిన పత్రిక సౌజన్యంతో